తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని బంజారాహిల్స్ లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 7 ఎకరాల విస్తీర్ణంలో 20 అంతస్తులు, 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణం పనులు అనుకున్నంత వేగంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సిఎం కోరారు. కేవలం శాంతి భద్రతల పర్యవేక్షణకే కాకుండా విపత్తుల నిర్వహణ, పండుగలు- జాతరల నిర్వహణ తదితర కార్యక్రమాలను కూడా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించవచ్చని సిఎం అన్నారు.
see also:కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంకయ్యే పంచ్ వేసిన మంత్రి కేటీఆర్
దేశంలో మొదటి సారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటూ ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తుందని సిఎం చెప్పారు. ముఖ్యమంత్రి వెంట హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, ఆర్ అండ్ బి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, డిజిపి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, ఆరూరి రమేష్, గంగుల కమలాకర్, అరికెపూడి గాంధి, సంజీవరావు, ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి , టి ఎస్ ఎం డి సి చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి తదితరులున్నారు.