ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేశారని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతలపై మంగళవారం ఆయన గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టారని విమర్శించారు. టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తన నియోజకవర్గంలో నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ బూత్లోకి వెళ్లారని, ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కోడెల ఆయన చొక్కాను ఆయనే చించేసుకున్నారని జగన్ విమర్శించారు.
గురజాలలో ఓట్లు వేయలేదని ముస్లింలపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని జగన్ ఆరోపించారు. పూతలపట్టులో తమ అభ్యర్థి ఎంఎస్ బాబుని కొడితే ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. ఒకే కులానికి చెందిన 40 మందికి డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని విమర్శించారు. నచ్చినవాళ్లకు చంద్రబాబు పోస్టింగ్లు ఇచ్చారన్నారు. స్ట్రాంగ్రూముల్లోని ఈవీఎంలను బయటికి తెచ్చారని, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూములు తెరవాలన్నారు. స్ట్రాంగ్రూముల దగ్గర పారామిలటరీ బలగాలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేసి సీఈవో, సీఈసీ పర్యవేక్షించాలని జగన్ అన్నారు.