తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు పోషణ్ అభియాన్ అవార్డు వరించింది. జిల్లాలో పోషణ్ అభియాన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాగా సంగారెడ్డిని ఎంపిక చేసింది.
ఈ క్రమంలో ఇవాళ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావు.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ మోతి, డీఆర్డీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.పోషణ్ అభియాన్ కింద 2018-19 సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాగా సంగారెడ్డి ఎంపికైన సంగతి తెలిసిందే.
గత ఏడాది సెప్టెంబర్ నుంచి జిల్లాలో పోషణ్ అభియాన్ కార్యక్రమం ప్రారంభం అయింది. పోషణ లోపం లేని సమాజ నిర్మాణం కోసం కలెక్టర్ హనుమంతరావు జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పోషణపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. క్షేత్ర స్థాయిలో ప్రజలన్ని చైతన్యం చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా పంచాయతీ, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఇమ్యూనైజేషన్ శాఖల సమన్వయంతో కలెక్టర్ చేసిన కృషి ఫలించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల నుంచి 149 ప్రాజెక్టులు అవార్డుల కోసం ప్రతిపాదనలు పంపించంగా, అందులో జిల్లా ఉత్తమ జిల్లాగా ఎంపికైంది.