ప్రజా రాజధాని నిర్మించే ఉద్దేశంతోనే అమరావతిలో రైతుల వద్ద భూసేకరణ చేశామని తమకు అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదని అమరావతి ప్రాజెక్టు తప్పు అని ప్రజలంటే.. క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిపై టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహించారు. సమావేశానికి సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నుంచి పోతిన మహేష్, ఆర్ఎస్పీ నుంచి జానకి రాములు హాజరైనారు. వీరితో పాటుగా రౌండ్ టేబుల్ సమావేశానికి ఎమ్మెల్యే బాలకృష్ణ, ఫార్వర్డ్ బ్లాక్, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ, ప్రజా సంఘాల నేతలు హాజరైనారు.
సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు అమరావతిలో పర్యటించామని తెలిపారు. అమరావతి పరిస్ధితిని ప్రజలకు తెలిపేందుకే ఈ సమావేశం ఉద్దేశమని వివరించారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి పైనా ఉందన్నారు. అమరావతి భావితరాల భవిష్యత్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం, సమాజం శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదని అన్నారు. అమరావతిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజాచైతన్యం వల్లే అమరావతి నిలబడుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రతి తెలుగు బిడ్డ గర్వించే ప్రజారాజధానిని నిర్మించాలని భావించామని దానిపై అవినీతికి తావులేదని వివరించారు.