కరోనా వైరస్ విజృంభన, లాక్డౌన్ తర్వాత తొలిసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు ఉదయం 10 గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ బయల్దేరబోతున్నారు. దాదాపు నాలుగు నెలల తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన నివారణ చర్యలను, పెద్ద ఎత్తున నిర్వహించిన కరోనా పరీక్షల గురించి అమిత్ షాకు వివరించనున్నారు. లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆయా అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకురానున్నారు. వలస కూలీల తరలింపుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను వీరిద్దరు చర్చించనున్నారు. అలాగే ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్… అంశంపై వచ్చిన తీర్పుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిమాణాల నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిలు కూడా ఢిల్లీ వెళ్లబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై జగన్ చర్చించనున్నారని సమాచారం.