నవంబర్ 8, 2016, ఈ తేదీ ప్రతి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్రతీ సామాన్యుడు వారి జీవిత కాలంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఆరు నెలలపాటు ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి సామాన్యులకు సంవత్సరం పట్టింది. అయినా, కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఇంతలా దేశ ఆర్థిక వ్యవస్థను, సామాన్యులను ఉలిక్కిపడేలా చేసిన ఆ నిర్ణయం అందరికీ తెలిసిందే. అదే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.
ఏదేమైనా, ఆ రోజు నుంచి నగదు కొరతతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలను ఆదుకునేందుకు మేం చేపట్టాల్సిన చర్యలు చేపడుతున్నామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పుకొస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తో దేశంలోని అన్ని రాష్ట్రాలు మొదట మూడు నెలలు ఇబ్బందులు పడ్డా.. తరువాత కాలంలో నగదు కొరత అంతగా లేదనే వార్తలు టీవీ ఛానల్లో ప్రసారమైన విషయం తెలిసిందే. కానీ, బీజేపీ పెద్దలే ఆ వార్తలన్నింటిని కల్పించి టీవీ ఛానెళ్లలో వేయిస్తున్నారంటూ పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే, మోడీ సర్కార్ పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికీ సామాన్యులను వేధిస్తూనే ఉంది. పెద్ద నోట్లు రద్దు చేసి సంవత్సరం గడుస్తున్నా.. ఇప్పటికీ బ్యాంకులకు వెళితే అధికారులు నగదు లేదని చెప్తున్నారని, ఏటీఎంలకు వెళితే నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోడీ నోట్ల రద్దు సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. మూడు నెలలు ఓపిక పట్టండి.. విదేశీల్లో ఉన్న భారత్కు చెందిన రూ.71 లక్షల కోట్ల నల్ల ధనాన్ని తీసుకొచ్చి.. దేశంలోని ప్రతీ సామాన్యుడి అకౌంట్లో రూ.15 లక్షలు జమ చేస్తానంటూ చెప్పిన విషయం తెలిసిందే. ఆ రూ.15 లక్షల సంగతి ఏమోకానీ, బ్యాంకుల్లో ఉన్న మా నగదునే తీసుకునేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తుందని ప్రజలు బాహాటంగానే మోడీ పాలనను విమర్శిస్తున్నారు. మరికొందరైతే తమ ఖాతాలో మోడీ రూ.15 లక్షలు జమ చేసి ఉంటారేమోనని, ప్రతీ రోజు తమ బ్యాంక్ పాస్ బుక్లను అప్డేట్ చేసుకుంటున్నారు.
అంతేకాకుండా, ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా నోట్ల కొరత తీవ్రత చాలానే పెరిగింది. ఏ బ్యాంకుకు వెళ్లినా.. ఏ ఏటీఎంకు వెళ్లినా నో క్యాష్ బోర్డులే. అయితే, ప్రస్తుత దేశ పరిస్థితులను అంచనా వేసిన ఆర్థిక వేత్తలు, రాజకీయ విశ్లేషకులకు తలెత్తుతున్న ప్రశ్న ఒక్కటే. అదేమిటంటే..? ప్రధాని మోడీ నవంబర్ 8, 2016న అధికారికంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ, ఆ నిర్ణయాన్ని మీడియా వేదికగా ప్రజలకు చేరేలా చెప్పారు.. కానీ ఇవాళ ఏ బ్యాంకులో, ఏ ఏటీఎంలో చూసిన నో క్యాష్ బోర్డులు కనిపించడం.. వెనుక. ప్రధాని ఏమన్నా.. అప్రకటిత పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తీసుకున్నారా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది కేవలం ఆర్థికవేత్తల ప్రశ్నే కాదు.. ప్రతీ సామాన్యుడి మదిలో తలెత్తుతున్న ప్రశ్న.