అన్నదాతల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం రైతులకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంపై వివిధ రాష్ర్టాలకు చెందిన రైతు సంఘాల నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, రైతుల మేలు గురించి ఆలోచించని పార్టీలు, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇదిలాఉంటే…తెలంగాణ రైతుల సంబరాన్ని జీర్ణించుకోలేని రాష్ట్ర బీజేపీ నాయకులు తమ ఆక్రోశాన్ని రైతులపై చూపుతున్నారు. వారిని అవమానపర్చేలా వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మాట్లాడుతూ రైతుబంధు డబ్బులతో రైతులు బీర్లు తాగుతున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై రైతు సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. బీజేపీ నేతల తీరుకు నిరసనగా పలువురు అన్నదాతలు నిరసనలు తెలిపారు. ఈ నిరసనలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టికి చేరినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని విమర్శలు ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీ నేతలపై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో షాక్ తిన్న సదరు బీజేపీ నేత మీడియాకు వివరణ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించారని వాపోయారు.
కాగా బీజేపీకి చెందిన కొందరు నేతల తీరుపై పార్టీలో చర్చ జరుగుతోందని సమాచారం. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలను కూడా విమర్శించడం వాటిపై ఆరోపణలు చేయడం ద్వారా పార్టీ పరువు గంగపాలు అవుతోందని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రజలకు మరింత దూరం అవుతున్నామని, రాబోయే కాలంలో అధికారంలోకి రావడం సంగతి అలా ఉంచితే…ఉన్న సీట్లు కూడా దక్కే చాన్స్ లేదని వాపోతున్నారు.
Post Views: 295