తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైన దగ్గర్నుంచి పూటకో సర్వే బయటికి వస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. నేషనల్ మీడియా, ప్రాంతీయ మీడియాలతో పాటు పలు సర్వేసంస్థలు చేసిన సర్వేల్లో దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారం చేపట్టబోతోందనే ఫలితాలు రాగా ఇటీవల కొందరు చేసిన సర్వేల్లో మాత్రం ప్రతిపక్ష కూటమికి అనుకూలంగా ఫలితాలు రప్పించి ప్రజల్లో గందరగోళం నెలకొల్పే ప్రయత్నాలు చేసారు.
ఈ నేపధ్యంలో పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు వచ్చింది. స్థాపించిన అనతి కాలంలోనే దరువు వెబ్ సైట్ కు విశేష ఆదరణ లభించింది. తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు మంచి కార్యక్రమాలు చేసినపుడు అభినందించడంతోపాటు ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేసినపుడు నిలదీసేందుకు వెనుకాడలేదు. అలాగే ప్రతిపక్షా బాధ్యతలను ఎప్పటికప్పుడు గుర్తు చేసింది. గతంలో దరువు చెప్పిన సమాచారం మొత్తం అక్షరసత్యాలయ్యాయి. పార్టీల్లో చేరికలు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలుపోటములను ముందుగానే వెల్లడించింది దరువు.
ఈ నేపధ్యంలో తెలంగాణ ఎన్నికల సందర్భంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా వీడియో సర్వే చేపట్టింది దరువు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యుత్తమ నైపుణ్యం, అనుభవం కలిగిన యువతతో సర్వే ప్రక్రియ ప్రారంభించిన దరువు టీం.రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లోని ప్రతీ గ్రామాన్నీ పలకరించింది. ప్రతీ మండల కేంద్రంలోనూ ఓటర్ల నాడి తెలుసుకునే ప్రయత్నం చేసింది. చేతివృత్తులవారు, వ్యాపారులు, విద్యార్ధులు, గృహిణులు, ప్రయాణికులు, ఉద్యోగులను విడతలవారీగా సర్వే చేసింది. దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, సామాన్యులు, పేద ప్రజలు ఇలా ప్రతీ ఒక్కరితో మాట్లాడి విశ్లేషించింది.
దాదాపుగా 80వేలమంది బైట్స్ ని వీడియో రూపంలో సేకరించింది దరువు. వాటిని విశ్లేషించగా.. 75శాతంమంది కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనుకున్నట్టు తేలింది. అక్కడక్కడా పార్టీ అభ్యర్ధులపై కాస్త అసంతృప్తి ఉన్నా.. కేసీఆర్ మానియా ముందు అవేమీ పనిచేయవని, అలాగే ప్రతిపక్ష కూటమి ప్రభావం చూపదని తేలింది.
ఈ సర్వేలో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని తేలింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 60 స్థానాలు అవసరంకాగా.. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి 78 నుంచి 85 సీట్లు దక్కుతాయని తేలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి 16 నుంచి 22 (కాంగ్రెస్+టీడీపీలకు మాత్రమే) సీట్లు, ఎంఐఎం పార్టీకి 7సీట్లు వస్తాయని తేలింది. బీజేపీ 3 స్థానాలకు పరిమితం కాగా, సీపీఎం నేతృత్వంలోని బీఎల్ఎఫ్, స్వతంత్రులకు తలా ఒక సీటు రానుందని దరువు ఫ్లాష్ టీం చేసిన సర్వేలో వెల్లడైంది. ప్రజాకూటమిలో భాగమైన టీజేఎస్, సీపీఐలకు ఒక్కస్థానం కూడా దక్కే అవకాశం లేదని తేలింది. రాష్ట్రవ్యాప్తంగా దరువు నిర్వహించిన సర్వేలో అతికొద్ది నియోజకవర్గాల్లో మాత్రమే టీఆర్ఎస్, కూటమి అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. మరికొన్ని నియోజకవర్గాల్లో రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓటింగ్ శాతంలో తేడా కేవలం 2 నుంచి 5 శాతం వరకు తేడా ఉంది. కాంగ్రెస్ రెబల్స్, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న కొన్ని ప్రత్యేక స్థానాల్లో త్రిముఖ పోటీ కనిపించిందే తప్ప.. ఎక్కడా చదుర్ముఖ పోటీ కనిపించలేదు.