వైఎస్ జగన్ పాదయాత్ర రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలోనూ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పలు సమస్యలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజల్లో భరోసా, స్థైర్యాన్ని నింపుతూ సాగిన ఈ పాదయాత్ర అధికార టీడీపీని బెంబేలెత్తించగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో గుబులు రేపింది. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో వేడిని రగిల్చింది. ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చి రాష్ట్ర ప్రజల ఆశలకు కొత్త ఊపిరులూదింది. ప్రజలందరూ ప్రత్యేక హోదాపైనే ఆశలు పెట్టుకోగా అదే హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు స్వార్థ ప్రయోజనాలు, ఓటుకు కోట్లు కేసు భయంతో హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారు.
అయితే దాదాపు ఐదేళ్ల పాటు నిరంతర పోరాటం ద్వారా ప్రజలను జాగృతం చేసి ప్రత్యేక హోదా నినాదాన్ని వైఎస్ జగన్ సజీవంగా ఉంచారు. ప్రత్యేక హోదా సాధన కోసం తమ ఎంపీలతో రాజీనామా చేయించి ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చారు. హోదాపై పలుమార్లు మాటమార్చి ‘యూటర్న్’ తీసుకున్న చంద్రబాబు ఎన్నికలు సమీపించడంతో గత్యంతరం లేక ప్రత్యేక హోదా బాట పట్టారు. వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాలతో చంద్రబాబు మరోదారి లేక కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ నుంచి వైదొలగారు.