కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రారావు గురించి తెలియదేముంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పేరొందిన కేవీపీ ఆయన జీవించి ఉన్న కాలంలో కేవీపీ ఎంత చెపితే అంత అన్నట్లుగా సాగింది. ఆయన మరణానంతరం వైఎస్ కుటుంబంతో కేవీపీ సంబంధాలు తగ్గిపోయాయి. అయితే, తాజాగా ఆయన జగన్కు దగ్గర అవుతున్నారు. ఇటీవల ఓ మీడియా సంస్థతో కేవీపీ మాట్లాడుతూ, జగన్తో తన అనుబంధం తెగిపోయేది కాదని స్పష్టం చేశారు. తాజాగా, గురువారం జరిగిన వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కేవీపీ పాల్గొన్నారు. త్వరలో కేవీపీ వైసీపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ నేతగా ఉన్న కేవీపీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే, దీని వెనుక లెక్కలు వేరేనంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అయిపోయిన నేపథ్యంలో ఆ పార్టీలో ఉండలేకపోతున్నారని సమాచారం. మరోవైపు తన అత్యంత ఆప్తుడి కుమారుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అఖండ విజయంతో అధిరోహించిన నేపథ్యంలో…కేవీపీ ఆయనకు చేరువ కావాలని సిద్ధమైపోయినట్లు సమాచారం. అందులో భాగంగానే ప్రమాణ స్వీకారానికి కుటుంబ సభ్యులతో విచ్చేశారని చెప్తున్నారు. త్వరలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు పేర్కొంటున్నారు. ఒకట్రెండు రోజుల ముందు ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.
ఇటీవల మీడియాతో మాట్లాడిన కేవీపీ జగన్ తనకు మేనల్లుడిలాంటి వాడని తెలిపారు. తమ అనుబంధం వ్యక్తిగతమని, రాజకీయాలకు సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ తాను ఎంచుకున్న దారిలో నడుస్తున్నారని కేవీపీ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను జగన్తో ఎందుకు లేనన్న విషయాన్ని ఓపెన్గా చెప్పలేనని.. దాని గురించి చర్చించే సమయం ఇది కాదని వివరించారు. ఈ కామెంట్ల వెనుక మర్మం జగన్ గూటికి కేవీపీ చేరుకోవడమేనని అంటున్నారు.
Post Views: 272