తెలుగుదేశం సీనియర్ నాయకుడు, గోదావరి జిల్లాలో బలమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కమలం గూటికి చేరనున్నారని తెలుస్తోంది. తాజా పరిణామాలను చూస్తుంటే తోట పార్టీ మారుతున్నారని తెలుస్తోంది. ఇటీవలతనకు బీజేపీలో చేరాలంటూ ఆహ్వానాలు అందుతున్నాయంటూ తోట త్రిమూర్తులు స్వయంగా చెప్పారు. అదే సమయంలో తనకు తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచన లేదని తోట స్పష్టంచేశారు. తాజాగా విజయవాడలోని మాజీ ఎమ్మెల్యే బోండ ఉమ నివాసంలో ఏపీలోని కాపు సామాజికవర్గ నేతలంతా భేటీ అయ్యారు. గతంలో ఇటువంటి భేటీనే కాకినాడలో జరిగింది. అయితే తాజా ఎన్నికలలో ఓటమి, భవిష్యత్ కార్యాచరణ కోసమే ఈ భేటీలు జరిగినట్లు తోట త్రిమూర్తులు వివరించారు. కాగా కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తున్నా బీజేపీలో మూకుమ్మడిగా చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
