ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోకో కేసులో భారీ ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ చేసిన చిన్న తప్పిదం వల్ల జగన్ ఈకేసు నుంచి ఊరట లభించింది. కేవలం 11కోట్ల రూపాయల లబ్ది కోసం రూ.45కోట్లు లంచం ఇచ్చారంటూ ఈడీ పేర్కొనడాన్ని అపిలేట్ ట్రిబ్యునల్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. జగన్పై అనేక కేసులు నమోదైవున్న విషయం తెల్సిందే. ఇందులో క్విడ్ ప్రోకో కూడా ఒకటి. ఈకేసులో పెన్నా సిమెంట్ అటాచ్మెంట్కు సంబంధించి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పెద్ద తప్పిదం చేసింది. ఇదే జగన్కు ప్లస్ అయ్యింది. ఈ కేసు విచారణ ప్రస్తుతం పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కింద అపిలేట్ ట్రైబ్యునల్లో పెన్నా సిమెంట్ రూ.11 కోట్ల లబ్దిని పొందిన కారణంగా, జగతి గ్రూప్లో లంచంగా రూ. 45కోట్లు పెట్టుబడులను ఆ సిమెంట్ కంపెనీ యాజమాన్యం పెట్టినట్టుగా ఈడీ పేర్కొంది.
పైగా, అనంతపురం జిల్లా యాడికి మండలంలోని కామలపాడులో 231 ఎకరాలను, హైదరాబాద్ బంజారాహిల్స్లో పయొనీర్ హాలిడే రిసార్ట్స్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న హోటల్ను అటాచ్ చేసింది. వీటిని సవాల్ చేస్తూ పెన్నా సిమెంట్స్ అపిలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన అపిలేట్ ట్రైబ్యునల్ ఆశ్చర్యాన్ని వ్యక్తంచేసింది. ఇది ఊహకు కూడా అందడం లేదు. అసలు అర్థం కావడం లేదు. ఎలాసాధ్యం? అని ప్రశ్నించింది. సదరు సంస్థ యాజమాన్యం సాక్షి పత్రికలో పెట్టిన పెట్టుబడులను వ్యాపార లావాదేవీల కిందే భావిస్తున్నామని, సాక్షి ఆవిష్కరణ నుంచి తెలుగులో రెండో అత్యధిక సర్క్యులేషన్తో నడుస్తోందని గుర్తు చేసింది.