తన్నీరు హారీష్ రావు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత.. ఆర్థిక శాఖ మంత్రి. అతను కాంగ్రెస్ సీనియర్ నేత.. ప్రస్తుత ఎమ్మెల్యే.. దాదాపు పద్నాలుగేళ్ల నుండి వీరిద్దరి మధ్య మాటల్లేవు. కలవడాల్లేవు. అయిన అతను వేరే పార్టీ.. ఇతను వేరే పార్టీ కలవాలని.. మాట్లాడాలని ఎక్కడైన రాజ్యాంగంలో రాసి ఉందా అని అడక్కండి.
అసలు విషయం ఏమిటంటే సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి అప్పటి ఉమ్మడి ఏపీలో టీఆర్ఎస్ తరపున 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పిలుపుతో టీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్లో చేరారు. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి హారీష్ రావును రాజకీయంగా పలు అసత్య ఆరోపణలు.. విమర్షలు చేస్తూ ఉండేవారు.
తాజాగా నిన్న గురువారం అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి హారీష్ రావుతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికై నిధులు కేటాయించాలి. నియోజకవర్గ అభివృద్ధికై సహాకరించాలని మంత్రి హారీష్ రావును కోరారు. దీనికి స్పందించిన మంత్రి హారీష్ రావు నియోజకవర్గ అభివృద్ధికి కలిసి వస్తానంటే నేను వద్దంటానా అని బదులిచ్చారు.