తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ శరన్నరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు సద్దుల బతుకమ్మ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.అందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు.
స్టేడియంలో ఆడపడుచులంతా తీరొక్క పూవులతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ.. నృత్యాలు చేశారు. మహిళలంతా ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్బండ్ వరకు బతుకమ్మలతో ర్యాలీగా బయలుదేరారు. ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలతో కళకళలాడుతున్నాయి. హుస్సేన్ సాగర్ జలాలపై ఆకర్షణీయంగా బతుకమ్మ కటౌట్లను ఏర్పాటు చేశారు.
ఇవి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కులాలు, మతాలకు అతీతంగా నగర మహిళలు బతుకమ్మ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ బతుకమ్మ శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది. ట్యాంక్బండ్పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.