వారం రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, ముంచెత్తుతున్న వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుండటంతో బాధితులను ఆదుకొనేందుకు నేనున్నానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభయమి చ్చారు. భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన సోమవారం తెలిపారు.
వరద ప్రభావానికి గురైన కుటుంబాలకు ఇంటికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. వర్షాలు, వరదల వల్ల ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు చెప్పారు. ఇందుకోసం పురపాలకశాఖకు తక్షణం రూ.550 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సహాయం మంగళవారం ఉదయం నుంచే అందించడం ప్రారంభిస్తామని వెల్లడించారు. వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లో నివసిస్తున్నవారు ఎంతో నష్టపోయారని, ఇండ్లలోకి నీళ్లు రావడం వల్ల బియ్యం సహా ఇతర అహార పదార్థాలు తడిసిపోయాయని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు.
దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక వసతులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ‘గడిచిన వందేండ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం హైదరాబాద్లో కురిసింది. ప్రజలు అనేక కష్టనష్టాలకు గురయ్యారు. నిరుపేదలు, బస్తీల్లో ఉండేవారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు ఎక్కువ కష్టాల పాలయ్యారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక విధి. కష్టాల్లో ఉన్న పేదలకు సాయం అందడంకన్నా ముఖ్యమైన బాధ్యత ప్రభుత్వానికి మరొకటి లేదు. అందుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇంటికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించాం’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
నేటి నుంచే సాయం
జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. 200 నుంచి 250 బృందాలు ఏర్పాటుచేసి, అన్నిచోట్ల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సీఎస్ సోమేశ్కుమార్ను సీఎం ఆదేశించారు. పేదలకు సహాయం అందించడం అతి ముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ అంతా భాగస్వాములు కావాలన్నారు.
నష్టపోయిన ప్రజలు లక్షమంది ఉన్నా సరే, సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధమన్నారు. బాధితుల వివరాలు అధికారులకు చెప్పి, సహాయం అందించాలని కోరారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని, బాధితులకు అండగా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్లో వర్షాలు, వరద బాధిత పేదలకు సహాయం కోసం ఆర్థికశాఖ రూ.550 కోట్లను పురపాలకశాఖకు విడుదల చేసింది.