ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 84,401 శాంపిల్స్ను పరీక్షించగా.. 2,886 మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 8,20,565కి పెరిగింది.
తాజాగా కృష్ణాలో 448 కేసులు బయటపడగా.. తూర్పుగోదావరిలో 405, గుంటూరులో 385, చిత్తూరులో 296 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం కొత్తగా 3,623 మంది కరోనా నుంచి బయటపడగా.. మొత్తం రికవరీలు 7,88,375కి చేరుకున్నాయి.
ప్రస్తుతం 25,514 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు 24 గంటల్లో 17 మందిని కరోనా బలి తీసుకుంది. కృష్ణాలో ముగ్గురు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, తూర్పుగోదావరి, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. మొత్తం మరణాలు 6,676కి చేరుకున్నాయి.