హైదరాబాద్ నగరంలోని జవహర్నగర్లో జీహెచ్ఎంసీ, రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ సంయుక్తాధ్వర్యంలో మున్సిపల్ వ్యర్థాలతో విద్యుత్(వేస్ట్ టూ ఎనర్జీ)ను ఉత్పత్తిచేసే ప్లాంటును నిర్మించారు. 19.8మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంటును మంగళవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే దక్షిణ భారతదేశంలోనే వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తిచేసే మొదటి ప్లాంటు ఇది కావడం విశేషం.
ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులో భాగంగా వ్యర్థాలతో విద్యుత్ను ఉత్పత్తిచేసే ప్లాంటును ఏర్పాటుచేయాలని జీహెచ్ఎంసీ, రాంకీ ఎన్విరో మధ్య ఒప్పందం ఉంది. ఇందులో భాగంగా మొదటి దశలో 19.8మెగావాట్ల సామర్థ్యంగల ప్లాంటును ఏర్పాటు చేశారు. ఇందులో పర్యావరణానికి ఎటువంటి నష్టం జరుగకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం(రెఫ్యూజ్ డీరైవ్డ్ ఫ్యూల్, ఆర్డీఎఫ్)తో విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. బెల్జియంకు చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో ఉపయోగించి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్లాంటును ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు.
గత ఆగస్టు 20వ తేదీనుంచే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాగా, ఇప్పటివరకు సుమారు కోటిన్నర యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసినట్లు, ఒక్కో యూనిట్ రూ.7.40చొప్పున ట్రాన్స్కోకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఐదేండ్లలో నగరంలో వెలువడనున్న వ్యర్థాలతో 98మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తిచేసే వీలు కలుగుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని రెండోదశలో ప్లాంటును 48మెగావాట్ల మేరకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు గతంలోనే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతులు మంజూరుచేసినట్లు తెలిపారు. ఇదికాకుండా 14.5మెగావాట్ల సామర్థ్యంగల మరో ప్లాంటును దుండిగల్లోని టీఎస్ఐఐసీ స్థలంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే పనులు కూడా మొదలయ్యాయని అధికారులు వివరించారు.