గడిచిన ఆరేళ్లలో నగరంలో ఎలాంటి అశాంతి, అభద్రతా భావం లేదని, శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఎప్పడూ రాజీపడలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎలాంటి హైదరాబాద్ కావాలో పారిశ్రామిక వేత్తలు నిర్ణయించుకోవాలని సూచించారు. అభివృద్ధి హైదరాబాద్ కావాలా? అరాచకాల హైదరాబాద్ కావాలా? ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజా శ్రేయస్సు కోరే ప్రభుత్వం కావాలా? మతాల పేరుతో కిరికిరిలు పెట్టేవారు కావాలో ఆలోచించాలన్నారు.
హైదరాబాద్లో మత ఘర్షణలు లేవని, ప్రాంతీయ విభేదాలు లేవన్నారు. ఆరేండ్లుగా హైదరాబాద్ ఎంతో ప్రశాంతంగా ఉందని తెలిపారు. ఏ నగరంలోనైనా శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు. హైదరాబాద్లో ఐదు లక్షల సీసీ లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, షీటీమ్స్ ఏర్పాటు చేసి మహిళల భద్రతకు భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు.
టీఎస్ బీ-పాఎస్ ద్వారా భవన నిర్మాణాలకు వేగంగా అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. వ్యాపారాలు సజావుగా నడిస్తేనే పరిశ్రమలు వస్తాయని, కార్మికులకు ఉపాధి దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ పనులు జరిగేవని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం ధరని పోర్టల్ ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయన్నారు.
గడిచిన ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి రూ.2.72లక్షల కోట్లు పన్నులు చెల్లించామని, ఇందులో తెలంగాణకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1.40లక్షల కోట్లేనని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తొలి ప్రాధాన్యత రైతాంగానికే ఇచ్చారని, రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు డిసెంబర్ నుంచి ఉచితంగా 20వేల లీటర్ల నీటిని ఇవ్వనున్నట్లు చెప్పారు.