‘యాక్షన్ సినిమాలు, వెబ్సిరీస్లలో నటిస్తూ బిజీ అయిపోయా. లవ్స్టోరీ చేసి చాలా కాలమైంది. రొమాన్స్ చేయడం మర్చిపోయా’ అని తెలిపింది తమన్నా. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తూ భావనారవితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యదేవ్, మేఘా ఆకాష్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది.
ఈ సందర్భంగా ఆదివారం చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. తమన్నా మాట్లాడుతూ ‘కోవిడ్ ప్రభావిత పరిస్థితుల్లో నెగెటివిటీ పెరిగింది. ఇలాంటి తరుణంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తూ ఆనందాన్ని పంచే మంచి సినిమాలు రావాలి. ఇది అలాంటి చిత్రమే అవుతుంది. రీమేక్ సినిమాలు చేయడం చాలా కష్టం. మాపై పెద్ద బాధ్యత ఉంది.నిజాయితీగా మనసుపెట్టి మేము పడుతున్న శ్రమ ఫలిస్తుందనే నమ్మకముంది. ప్రేమలో ప్రతి ఒక్కరూ ఫూల్ అవుతారు కాబట్టి ఏప్రిల్ 1న ఈ సినిమాను విడుదల చేస్తే బాగుంటుంది’ అని తెలిపింది.
దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘కన్నడ చిత్రం ‘లవ్మాక్టైల్’ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. తమన్నా, సత్యదేవ్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరూ వందశాతం శ్రమించి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు’ అని తెలిపారు. ‘ఈ సినిమాకు తమన్నా రియల్ హీరో. తాను ఈ చిత్రాన్ని అంగీకరించిన తర్వాతే గ్రాఫ్ పెరిగింది’ అని సత్యదేవ్ చెప్పారు. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నామని, ప్రేక్షకుల హృదయాల్లో చిరకాలం గుర్తుండిపోయేలా ఈ సినిమా ఉంటుందని మరో నిర్మాత భావనారవి చెప్పింది. ఈ కార్యక్రమంలో శ్యామ్, ఎమ్.ఎస్.రెడ్డి పాల్గొన్నారు.