ఒకరి కింద పని చేయకుండా.. తానే ఓ వ్యవస్థను నడుపుతూ నలుగురికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్న వారిని ఎస్సీ కార్పొరేషన్ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. ఇందులోభాగంగా 40 మందికి మొబైల్ టిఫిన్ సెంటర్లను మంజూరు చేసింది.
బుధవారం బేగంపేటలోని హరితప్లాజాలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి ఈ టిఫిన్ సెంటర్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు.
పైలెట్ ప్రాజెక్ట్గా..
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న స్వయం ఉపాధి పథకాల్లో అధికారులు అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్కెట్ అంచనాలను బట్టి పాతవాటి స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా అధికారులకు తట్టిన ఆలోచనే మొబైల్ టిఫిన్ సెంటర్లు. ఈ టిఫిన్ సెంటర్లు విరివిగా ఏర్పాటవుతుండటం, అనేక మంది ఉపాధి పొందుతుండటంతో తొలుత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్గా ఈ పథకాన్ని అమలు చేశారు.
ఇందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. 160కి పైగా రాగా.. వాటిని వడబోసిన అధికారులు హైదరాబాద్ జిల్లాలో 20 మందికి, రంగారెడ్డి జిల్లాలో 20 మందికి మొబైల్ టిఫిన్ సెంటర్లను మంజూరు చేశారు. అంతేకాకుండా బ్యాంకులను సంప్రదించి లబ్ధిదారులకు రుణాలు ఇప్పించారు. ఆటో ట్రాలీలను కొనుగోలు చేసి, వాటిని మొబైల్ టిఫిన్ సెంటర్లుగా ఫ్యాబ్రికేట్ చేయించారు. ఆయా వాహనాలను బుధవారం లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దశల వారీగా ఇలాంటి యూనిట్లను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.