కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బహదూర్ పల్లి గ్రామంలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ లో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బలపర్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి గారిని రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
సురభి వాణీదేవి గారి నరణరాల్లో ప్రజాసేవ జీర్ణించుకోపోయిందని, ఇప్పటికే వాణి దేవి గారు విద్యాసంస్థలను స్థాపించి విద్యాపరంగా ఎన్నో సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రాడ్యుయేట్ల సమస్యలను దగ్గర్నుండి చూసిన ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేసే అవకాశం ఉందని అన్నారు. వాణీ దేవి గారిని అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఇతర పార్టీలకు బయం పుట్టుకుందని, ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎలాగైనా విమర్శలు చేయాలనే ఆలోచనలో విపక్షాలు పడ్డాయని అన్నారు.
వారు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆలోచనతో ఓటు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రోజూ పెట్రోల్ ధరలు పెంచుతూ, ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు చేస్తూ, తెలంగాణకు బడ్జెట్లో మొండి చేయి చూపించిన బిజెపికి గుణపాఠంగా జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మీ వంటి పథకాలు దేశానికి రోల్ మోడల్ అని అన్నారు. వారు గలిస్తే బాస్ లు ఢిల్లీలో ఉంటారని, మనం గెలిస్తే మనకు మనమే బాస్ అన్నారు. ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ కనుక మన అభ్యర్థి వాణీ దేవి గారిని గెలిపించి పీవీ నర్సింహరావు గారికి సముచిత గౌరవం ఇద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.