ప్రస్తుతం రాజకీయ రంగంలో ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లోనూ కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తరహాలో ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని జగన్ ముందు నుంచే నిర్ణయం తీసుకున్నారు.
అదేవిధంగా ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ వంటి విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలని గతంలోనే మంత్రి వర్గంలో తీర్మానం చేశారు. ఆ దిశగానే అసెంబ్లీలో ఆ విధానాన్ని బిల్లు పాస్ చేసి ప్రత్యేక చట్టం కూడా చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలయ్యేలా చూశారు.
అదే తరహాలో తిరుపతి లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా నగదు పంపిణీ విధానానికి వైసీపీ పూర్తి దూరంగా ఉంది. ఆ దిశగానే పార్టీ ముఖ్యనాయకులకు కూడా జగన్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఆయన.. ఎన్నికలకు ముందురోజు ఎక్కడా ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ వంటివి చేయరాదని స్పష్టంగా చెప్పారు.