తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సిద్దిపేట కలెక్టరేట్ నుంచి మంత్రి హరీష్ రావు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అదనపు కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతులకు డబ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ రూ. 26 వేల కోట్లు సిద్ధంగా ఉంచారని తెలిపారు.
ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుందని స్పష్టం చేశారు. మిల్లులో ధాన్యం దించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి కావాలన్నారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగానే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు.
టార్ఫలీన్, గన్ని బ్యాగుల కొరత, ట్రాన్స్పోర్టు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు, చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే కొనుగోలు కేంద్రం ఇంచార్జీ అధికారిదే బాధ్యత అని హరీష్ రావు పేర్కొన్నారు.