బీజేపీ ఓ చెత్త పార్టీ అని, వరంగల్కు అభివృద్ధి వరాలు కురిపించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. విలేకర్ల సమావేశంలో దయాకర్రావు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించే యత్నం చేస్తోందని విమర్శించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీ ఒక్కటీ నిలబెట్టుకోలేదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. స్థలం ఇచ్చినప్పటికీ కేటాయించలేదన్నారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయాలను గాలికి వదిలారని ఆయన దుయ్యబట్టారు. మహారాష్ట్రలో నిర్మించిన అక్రమ ప్రాజెక్టులను బీజేపీ, కాంగ్రె్సలు అడ్డుకోలేదన్నారు. ఒక్క హామీ నెరవేర్చని బీజేపీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు.
పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ వరంగల్ను అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని మంత్రి తెలిపారు. సోమవారం వరంగల్ పర్యటనకు వచ్చి పలు వరాలు కురిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు దయాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. రూ.1575కోట్ల అంచనాలతో జైలు ప్రాంగణంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆటోనగర్ లేదా ఆజంజాహి గ్రౌండ్లో నిర్మించనున్నట్లు తెలిపారు. వరంగల్, హన్మకొండ రెండు జిల్లాలకు సమానంగా జనాభా ఉండేలా చూస్తామన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్కు సైతం అధునాతన సౌకర్యాలతో నూతన భవన నిర్మాణం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
వరంగల్లో విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. ఈ విలేకర్ల సమావేశంలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే రాజయ్య, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.