అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణతో పోటీపడే రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంటే చెప్పాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో వ్యవసాయాభివృద్ధికి ఏ పథకాలు అమలుచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో నిర్మించనున్న రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ భవనానికి శనివారం మంత్రులు నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, హరీశ్రావు, గంగుల కమలాకర్తో కలిసి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జమ్మికుంటలోని పత్తి మార్కెట్ యార్డులో నిర్వహించిన రెడ్డి కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి సీఎం కేసీఆర్ శ్రమిస్తుంటే ఓర్వలేని విపక్ష నేతలు హద్దు, పద్దు లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా మార్పురాలేదని, అభివృద్ధి జరగలేదని నిరూపించే దమ్ము ఎవరికైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. 40 లక్షల ఎకరాలకు నీళ్లియ్యగలిగే కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేండ్లలో పూర్తిచేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కంటే ఈటల జూనియరేనని పేర్కొన్నారు.
ఈటల కంటే రెండేండ్లు ముందుగానే గెల్లు టీఆర్ఎస్లోకి, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారని గుర్తుచేశారు. ఈటల అధికారంలో ఉన్నన్నాళ్లు నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టు వ్యవహరించారని, ఏ ఒక్కరోజూ నియోజవర్గానికి నలుగురు మంత్రులను తీసుకొచ్చి అభివృద్ధి చేయించలేకపోయారని విమర్శించారు. తన మెడికల్ కళాశాల అనుమతుల కోసం ఢిల్లీ వెళ్లడం తప్ప, హుజూరాబాద్కు ఒక్క పరిశ్రమ కూడా తేలేకపోయారని విమర్శించారు. గెల్లు శ్రీనివాస్ను గెలిపించి, అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.