నగరీకరణ పెరుగుతున్న కొద్దీ వ్యర్థపదార్దాలు ప్రపంచానికి పెను సవాల్ గా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి వ్యర్థపదార్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి సులబతరమౌతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనీ పురపాలక సంఘాలలో లభించే వ్యర్థ పదార్థాలనుండి సంప్రదాయేతర ఇంధనం ఉత్పత్తి చేసే ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా అంటూ శాసన మండలి సభ్యులు ఊళ్ళోల్ల గంగాధర్ గౌడ్,కే. నవీన్ కుమార్ లతో పాటు అలుగుబెల్లి నర్సిరెడ్డి లు సోమవారం రాష్ట్ర శాసన మండలి సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ కేంద్రం అమలులోకి తెచ్చిన నిబంధనల ప్రకారం 90.05 మేఘావాట్ల సామర్ధ్యం గల ప్రాజెక్టులకు దరఖాస్తులు వస్తే 76 మేఘావాట్ల సామర్ధ్యం గల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కఠినతరంగా ఉండడంతో ఔత్సాహికులు వెనకడుగు వేస్తున్నారని ఆయన తెలిపారు. ఉత్పత్తికి ఈ ఆర్ సి నిర్ణయించిన ధరలకు పొంతన కుదరక పోవడం కుడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదని ఆయన చెప్పారు. వ్యర్థం నుండి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా చేసే వ్యర్థం రవాణా ఉత్పత్తి దారులకు భారంగా మారడం ప్రధాన కారణంగా కనిపిస్తుందన్నారు.ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో కేవలం పురపాలక సంఘాల నుండి వెలువడుతున్న వ్యర్థ పదార్థాల నుండి 38.40 మేఘా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు ప్రారంభంయ్యాయని ఆయన చెప్పారు.
వినియోగంలో మాత్రం 19.80 మేఘావాట్ల సామర్ధ్యం గల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నట్లు ఆయన తెలిపారు. వ్యర్థ పదార్థాలతో రోజుకు 0.38 మేఘావాట్ల విద్యుత్చక్తిని ఉత్పత్తి చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.తద్వారా సంవత్సరానికి మూడు లక్షల టన్నుల co-2 ఉద్గారాలను నివారించడం జరుగుతుందన్నారు.ఆధునిక పరిజ్ఞానం తో యావత్ దక్షిణ భారతదేశంలో నే ఇది మొట్టమొదటి ప్రయోగం అని ఆయన తెలిపారు.వ్యర్థ పదార్థాలు ఇప్పుడు ప్రపంచానికే ఒక సవాల్ గా మారిందన్నారు. అటువంటి పరిస్థితులలో ఈ తరహా ప్రయోగాలకు ప్రోత్సాహం ఉండేలా కేంద్రం నిబంధనలు సవరిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు సిద్దంగా ఉందన్నారు.