దళితబంధు పథకం దళితుల దశ మార్చేస్తున్నది. నిన్నామొన్నటి దాకా వ్యవసాయ కూలీలుగా, చిన్నాచితక పనులు చేసుకొంటూ కుటుంబాలను పోషించుకున్న వారికి ఆర్థిక భరోసా ఇస్తున్నది. ఆగస్టు 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ శాలపల్లిలో దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు.
అదే రోజు తొలి దళితబంధు లబ్ధిదారుల్లో జమ్మికుంటకు చెందిన సంధ్య-గంగయ్య ఎంపికయ్యారు. అనంతరం జరిగిన సర్వేలో సూపర్మార్కెట్ పెట్టనున్నట్టు సంధ్య అధికారులకు తెలుపగా, వారు ఓకే చేశారు.
సూపర్ మార్కెట్కు సరిపడా వస్తువులు అందించేందుకు హిందూస్తాన్ లివర్ లిమిటెడ్ ముందుకొచ్చింది. సోమవారం సీఎం కేసీఆర్ చిత్ర పటానికి మొక్కి, సూపర్ మార్కెట్ను ప్రారంభించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కలలో కూడా ఊహించని స్థానంలో ఆ కుటుంబం కూర్చున్నది.