తెలంగాణ కిరీటంలో మరో అరుదైన, అద్భుతమైన కలికితురాయి వచ్చి చేరింది. ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన రాష్ర్టాన్ని ‘ప్రపంచ విత్తన భాండాగారం’గా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఈ నెల 4, 5 తేదీల్లో ఇటలీ రాజధాని రోమ్ నగరం వేదికగా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) అంతర్జాతీయ విత్తన సదస్సును నిర్వహించనున్నది. ఈ సదస్సుకు తెలంగాణ రాష్ర్టాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. దేశంలో ఈ ఆహ్వానాన్ని అందుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం.
ఈ సదస్సులో ‘ఏ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఇండియా: తెలంగాణ స్టేట్ ఈజ్ ఏ గ్లోబల్ సీడ్ హబ్’ అన్న అంశంపై ప్రసంగించాల్సిందిగా ఎఫ్ఏవో ఆహ్వానించడంతో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ విత్తనరంగానికి విశిష్ఠ గౌరవం లభించినట్టయింది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు చెందిన మంత్రులు, కీలక నేతలు, విత్తన ప్రముఖులు, శాస్త్రవేత్తలు, విత్తన పరిశ్రమ ప్రతినిధులు హాజరుకానున్నారు.
మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కే కేశవులు పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా విత్తనోత్పత్తిలో తెలంగాణ అభివృద్ధిని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎలా ఎదిగిందన్న అంశంపై ఆయన ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం ఏకకాలంలో అంతర్జాతీయ భాషలైన ఇంగ్లిష్, స్పానిష్, ఫ్రెంచ్ భాషల్లో ప్రసారం కానున్నది. తెలంగాణ రాష్ర్టానికి ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషిచేసిన ఎండీ కేశవులును అభినందించారు.