రిపబ్లిక్ డే రోజు జమిలీ ఎన్నికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమని మరోమారు ఉద్ఘాటించారు. ‘‘లోక్సభ ఎన్నికలే అయినా.. రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా.. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్ అయినా.. ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. పదేపదే ఎన్నికలు జరగడం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకున్న మంగళవారం ఆయన బీజేపీ పన్నా ప్రముఖ్(పేజీ కార్యకర్త)లను ఉద్దేశించి మాట్లాడారు. జమిలీ స్ఫూర్తితో ‘ఒకే దేశం.. ఒకే ఓటరు జాబితా’ను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటరు కార్డును ఆధార్తో అనుసంధానం చేయడం వల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ‘‘మనం 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకొంటున్నాం. మన దేశంలో ఓటింగ్ కూడా 75 శాతాన్ని దాటాలి.
ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలి. పంచాయతీ మొదలు సార్వత్రిక ఎన్నికలదాకా.. ప్రతి పోలింగ్లో 75ు మార్కును దాటాలి’’ అని ప్రధాని ఆకాంక్షించారు. ‘‘పట్టణ ప్రాంతాల్లో ప్రజలు సమస్యలపై చర్చకు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. కానీ, ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించరు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఈ పరిస్థితిలో మార్పు రావాలి’’ అని ఆయన అభిలషించారు. ఈసీఐ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉందన్నారు. వ్యక్తులు, వ్యవస్థకూ నోటీసులు జారీ చేసే అధికారం ఈసీఐకి ఉందన్నారు. ఎన్నికల సమయంలో బ్యూరోక్రసీ వ్యవస్థను ప్రక్షాళన చేయగలదని, అధికారులను బదిలీ చేయగలదంటూ ప్రశంసించారు.