వచ్చే ఎన్నికల్లో 175 లోక్సభ స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పాల్.. గురువారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని.. అపోజిషన్ స్థానాన్ని తామే భర్తీ చేస్తామని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను అమిత్షాతో చర్చించినట్లు పాల్ తెలిపారు. ఏపీ, తెలంగాణ అప్పులపైనా వారితో చర్చించినట్లు చెప్పారు. ఏపీకి నిధులివ్వాలని కోరారన్నారు. ఏపీలో జనసేన పార్టీకి ఓటు బ్యాంక్ లేదని.. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వెంట ఎందుకు పడుతున్నారని అమిత్షాను ప్రశ్నించానన్నారు. ఆయన వెంట తాము పడటమేంటని.. పవనే తమ వెంట పడుతున్నట్లు అమిత్షా చెప్పారని పాల్ వ్యాఖ్యానించారు.