వైసీపీ పాలనపై బురద చల్లేందుకే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అమలాపురం ఘటనల్లో తప్పు చేసిన వారిని విడిచిపెట్టేదే లేదని ఆమె తేల్చి చెప్పారు. అమరావతిలో రోజా మీడియాతో మాట్లాడారు.
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే ఆందోళనలు చేయడం బాధాకరమని విమర్శించారు. ఈ కుట్రల వెనుక ఎవరున్నారో వాళ్లని బయటకు తీస్తామని చెప్పారు. చంద్రబాబు స్క్రిప్ట్నే పవన్ కల్యాణ్ చదువుతున్నారని.. ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నారని రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అప్పట్లో తుని ఘటనలో వైఎస్సార్ సీపీ వాళ్లు ఉంటే మీ పాలనలో ఎందుకు అరెస్టు చేయలేకపోయారని ఆమె ప్రశ్నించారు. కోనసీమలో ప్రజలు భయపడాల్సిన పనిలేదని.. ఈ అల్లర్ల వెనుక ఎవరున్నారో ప్రజలు గ్రహించాలని రోజా కోరారు.