పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు జాతీయ హోదా ఇస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పిందని.. కానీ ఈ ఎమిదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన.. భూత్పూర్లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు.
వికారాబాద్-కర్ణాటక, గద్వాల-మాచర్ల మార్గాల్లో రైలు కేటాయించమన్నా చేయలేదని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.3.65లక్షల కోట్లు వెళితే.. రాష్ట్రానికి మాత్రం రూ.1.68లక్షల కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయన్నారు. ఈ విషయంలో తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బీజేపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు.