పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ప్రతి నెలా 6 లేదా 7 సచివాలయాలు విజిట్ చేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కోసం అమరావతి వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు, రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై జగన్ కీలక ఆదేశాలిచ్చారు.
ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ.2కోట్ల నిధులు కేటాయించామని సీఎం జగన్ చెప్పారు. గ్రామాల్లో సచివాలయాల విజిట్ పూర్తిచేయాలని.. ఒక్కో సచివాలయం పరిధిలో సమస్యల పరిష్కారానికి రూ.20లక్షల నిధులు ఇస్తామని జగన్ ప్రకటించారు. సచివాలయాల పర్యటన పూర్తయిన వెంటనే జిల్లా కలెక్టర్లు నిధులు ఇస్తారని.. ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. జీవితంలో ఏ కార్యక్రమమైనా క్వాలిటీతో చేయాలన్నారు. గడప గడపకూ కార్యక్రమాన్ని క్వాలిటీతో చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.