ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తూ శాలరీ సరిపోక ఉద్యోగం లేదా సంస్థ మారాలనుకుంటున్నారా? అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ వచ్చే సంవత్సరం కంపెనీల్లో శాలరీలు పెరగనున్నాయి. కనీసం 10 శాతం వరకు జీతాలు పెరగొచ్చని ఓ నివేదిక తెలిపింది. కంపెనీలను ఉద్యోగులు వీడి వెళ్లిపోతున్నందున ఆ మేరకు వేతనాలు పెంచాలని సంస్థలు నిర్ణయించినట్లు గ్లోబల్ అడ్వైజరీ, సొల్యూషన్ కంపెనీ విల్లీస్ టవర్స్ వాట్సన్ నివేదిక పేర్కొంది.
మన దేశంలో సగానికి పైగా కంపెనీలు జీతాలు పెంచాలని నిర్ణయించగా.. 25 శాతం సంస్థలు మాత్రం ఎలాంటి మార్పులు చేయకూడదని నిర్ణయించినట్లు సమాచారం. మరికొన్ని ఇంకాస్త బడ్జెట్ తగ్గించుకునే ఆలోచనలో ఉన్నాయట.
ఇక రాబోయే 12 నెలల్లో ఐటీ, ఇంజినీరింగ్, సేల్స్, టెక్నికల్ స్కిల్స్ కలిగిన విభాగాలు, ఫైనాన్స్ రంగాల్లో రిక్రూట్మెంట్లు భారీగా ఉండబోతున్నాయని ఆ నివేదిక తెలిపింది. ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, టెక్నాలజీ రంగాల్లో 10.4 శాతం, మీడియాలో 10.2 శాతం, గేమింగ్ రంగంలో 10 శాతం వేతన పెంపుదల ఉంటుందని నివేదిక పేర్కొంది. మన దేశంలో 590 కంపెనీలు ఈ సర్వేలో పార్టిసిపేట్ చేశాయి.