వచ్చే ఏడాది మే నుంచి ఎన్టీఆర్తో సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశముందని ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ అన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ షూటింగ్ జరుగుతోందని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన స్వగ్రామం ఉమ్మడి అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఆయన పర్యటించారు.
తొలుత తన తండ్రి సుభాష్ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఆ తర్వాత స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రశాంత్ నీల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. సినిమా రంగంలో ఎంత గొప్పవాడినైనా మరణానంతరం నీలకంఠాపురంలో తన తండ్రి సమాధి పక్కనే తన సమాధి ఉంటుందని చెప్పారు. తన పూర్తిపేరు ప్రశాంత్ నీలకంఠాపురం అని చెప్పుకొచ్చారు.
కేజీఎఫ్ చిత్రాలతో భారీ హిట్లు కొట్టిన ప్రశాంత్ నీల్.. అగ్ర దర్శకుల్లో ఒకరిగా మారిపోయారు. అందుకే ఆయన్ను చూసేందుకు చుట్టు పక్కల ప్రజలు తరలి వచ్చారు.