కొత్తగా పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతో అత్తింటిలో కాలు పెట్టిన నవవధువుకు షాక్ తగిలింది. కొత్తకోడలికి కన్యత్వ పరీక్ష నిర్వహించారు అత్తింటివారు. ఆమె కన్యకాదని పరీక్షలో తేలడంతో చితక్కొట్టి పంచాయితీ పెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
రాజస్థాన్లోని మేవార్ ప్రాంతంలోని బిల్వారా జిల్లాలోని బాగోర్కు చెందిన ఓ వ్యక్తికి మే 11న పెళ్లి జరిగింది. నవవధువుకు ఈ ప్రాంతంలో కన్యత్వ పరీక్ష నిర్వహించే దురాచారం ఉంది. దీన్ని కుకుడీ ఆచారమని అంటారు. ఈ పరీక్షలో ఆ ఆమ్మాయి ఫెయిల్ అయ్యింది. దీంతో ఆమెకు అట్టింటివారు చితకబాది, ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అనంతరం మే 31న పంచాయితీ నిర్వహించగా వధువు కుటుంబానికి పంచాయితీ పెద్దలు రూ.10 లక్షల జరిమానా విధించారు. బాధిత మహిళ.. పెళ్లికాక ముందు తనపై పక్కంటి యువకుడు అత్యాచారం చేశాడని, దీనిపై అప్పట్లో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశానని పంచాయితీలో మొరపెట్టుకుంది. అయినా పెద్దలు జరిమానా చెల్లించాల్సిందే అని తీర్పు ఇచ్చారు. భర్త, అత్త, మామ, ఇతరులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.