KTR: హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఎన్హెచ్ఆర్డీ ‘డీకోడ్ ది ఫ్యూచర్’ అంశంపై జాతీయ స్థాయి సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశం కోసం నిధులు కేటాయించినట్లు అనిపించడం లేదని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మన పొరుగు దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు పోతుంటే….మన దేశంలో మాత్రం ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విమర్శించారు.
ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలకోసమే పాకులాడుతారని వ్యాఖ్యానించారు. ఇతర దేశాల్లాగానే భారత్ లోనూ ఆర్థికాభివృద్ధిపై దృష్టిసారిస్తే మొదటిస్థానంలో ఉంటామని వెల్లడించారు. ప్రపంచంలో మంచి మంచి బ్రాండ్స్ కలిగిన కంపెనీలు మన దేశం నుంచి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. మనదేశంలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని… జనాభాలో 60 శాతం మంది యువత ఉన్నారని తెలిపారు. దేశంలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నదని వెల్లడించారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎప్పడు ఎదుగుతారని ప్రశ్నించారు.
విస్తీర్ణంలో హైదరాబాద్ కన్నా సింగపూర్ చిన్నదిగా ఉన్నప్పటికీ…. అభివృద్ధిలో మాత్రం వేగంగా ముందుకెళ్తోందని అన్నారు. తెలంగాణ.. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని… దేశ జీడీపీలో 5 శాతం వాటా తెలంగాణదేనని తెలిపారు.
టీఎస్ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. 15 రోజులు దాటితే సంబంధిత అధికారి నుంచి రోజుకు వెయ్యి చొప్పున రుసుం వసూలు చేస్తున్నామని చెప్పారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ప్రఖ్యాతిచెందిన సంస్థల తమ రెండో అతిపెద్ద క్యాంపస్లను హైదరాబాద్లో ఏర్పాటు చేశామన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధిలో ముందుకెళ్తున్నదని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నాలుగేళ్లలోనే పూర్తిచేశామని తెలిపారు.