MLC KAVITHA: మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి మరణంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రీతి తల్లిదండ్రులకు కవిత లేఖ రాశారు. ప్రీతి మరణం తనను ఎంతో బాధకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణానికి కారకులపై ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ట్విటర్ వేదికగా ప్రీతికి ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేశారు.
ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఆమె కుటుంబానికి అండగా ఉంటుందని కవిత అన్నారు. వైద్య విద్య అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నానని కవిత చెప్పారు. చదువుకుని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల మెండుగా ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరమని కవిత అన్నారు. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయిందని వెల్లడించారు.
కడుపుకోత అనుభవిస్తున్న ప్రీతి తల్లిదండ్రులకు ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం ఎంత చేసినా అది తక్కువే అవుతుందని కవిత లేఖలో పేర్కొన్నారు. ఏ తల్లిదండ్రులకూ రాని పరిస్థితి ఈ తల్లిదండ్రులకు వచ్చిందని ఆవేదన వెలిబుచ్చారు. ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం, భారాస అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు కేసీఆర్ సర్కారు కృషి చేస్తుందని కవిత చెప్పారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ దేవుడు ఆమె కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు కవిత తెలిపారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.