ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, హార్బర్ల నిర్మాణ పనులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ జవహర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇతర దేశాల్లో ఎంఎస్ఎంఈల నిర్వహణ, నాణ్యమైన ఉత్పాదనల విధానాలను ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావాలన్నారు.
అదే విధంగా వినూత్న ఉత్పాదనలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై దృష్టి పెట్టాలని.. ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ సౌకర్యంతో పాటు, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించగలగాలని సీఎం సూచించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనుల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఇప్పటికే సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయన్న అధికారులు.. సెప్టెంబరు కల్లా డ్రెడ్జింగ్, రెక్లిమేషన్ పనులు పూర్తవుతాయని తెలిపారు.
అలానే మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను అధికారులు వివరించారు. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో సౌత్ బ్రేకింగ్ వాటర్ పనులు ప్రారంభం అయినట్లు అధికారులు తెలిపారు. కాకినాడ గేట్వే పోర్టు లిమిటెడ్ నిర్మాణ పనుల ప్రగతిని కూడా సీఎంకు అధికారులు వివరించారు. రామాయపట్నం పోర్టు పనుల ప్రగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. తొలి దశలో నిర్మిస్తున్న ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలపై కూడా సీఎం జగన్.. అధికారులను ఆరా తీశారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ లలో ఎంత మేరకు నిర్మాణం పూర్తి అయ్యిందో అధికారులు వివరించారు.