కొన్ని కథలకు సీక్వెల్స్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. నట రుద్రుడు ఎన్టీఆర్ కెరీర్లో అదుర్స్ చిత్రం కూడా అలాంటి కథే. ఈ సినిమాకు సీక్వెల్ వస్తే చూడాలని అభిమానులు వేచి చూస్తున్నారు. వినాయక్ కూడా ఈ చిత్రంపై స్పందించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సైతం అదుర్స్ -2పై మనసు విప్పాడు. మరి ఇంతకీ యంగ్ టైగర్కు అదుర్స్ సీక్వెల్పై ఇష్టం ఉందా..? వినాయక్ చెప్పినా ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా..?
ఇక అసలు విషయానికొస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం అరవింద సమేతతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. దాంతోపాటు పలు బ్రాండ్స్తో కూడా ఎన్టీఆర్ బిజీ.. బిజీగా గడుపుతున్నాడు. ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో తన తరువాతి సినిమాల గురించి నోరు విప్పాడు. ముఖ్యంగా అదుర్స్ -2 గురించి మనసులోని మాటను బయటపెట్టాడు.
ఎన్టీఆర్ కెరీర్లో అదుర్స్ ప్రత్యేకంగా నిలిచిపోయింది. ముఖ్యంగా ఆ చిత్రంలోని చారి పాత్ర. యంగ్టైగర్లో ఉన్న కామెడీ టైమింగ్ రేంజ్ ఏమిటో చూపించిన చిత్రం అదుర్స్. అలాంటి కథకు కొనసాగింపు అంటే కాస్త రిస్కుతో కూడుకున్న పనే. ఎన్టీఆర్ కూడా ఇదే ఫీలవుతున్నాడు. అదుర్స్లో చారి పాత్ర అనేది బ్రాండ్ అని, ఆ చిత్రానికి సీక్వెల్ చేసినా.. అది ఆడకపోతే ఉన్న ఇంప్రెషన్ పోతుందంటున్నాడు ఎన్టీఆర్.
అదుర్స్ -2పై ఎప్పట్నుంచో వినిపిస్తున్న వార్తలు తనకు కూడా తెలుస్తున్నాయని ఈ పాజిటివ్ వైవ్స్ అన్నీ కలిసి అదుర్స్ – 2 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నాడు ఎన్టీఆర్. అన్నీ కుదిరితే చేస్తానంటున్నాడు. దీనిపై వినాయక్, కోన వెంకట్లకే నిర్ణయం వదిలేశాడు ఎన్టీఆర్. అదుర్స్ – 2 చేయడానికి అభ్యంతరం లేదంటూనే చారి పాత్ర మళ్లీ చేయడమంటే సాహసమేనంటున్నాడు ఈ యంగ్ టైగర్.