ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే అనేకమంది ఉన్నతస్థాయి అధికారులపై బదిలీ వేటు పడింది. ఇందులో భాగంగా ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న ఆర్పీ ఠాకూర్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్న సీనియర్ అధికారి గౌతమ్ సవాంగ్ను డీజీపీగా నియమించింది. ఆర్పీ ఠాకూర్ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖకు డీజీగా బదిలీ చేసింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వర రావును కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. వెంకటేశ్వర రావుకు ప్రస్తుతం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఏసీబీ డైరెక్టర్గా కుమార్ విశ్వజిత్ను నియమించింది. అలాగే మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులనూ బదిలీ చేసింది.
ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్ను, ముఖ్యమంత్రి కార్యదర్శిగా సాల్మన్ ఆరోఖ్యరాజ్ను నియమించింది. ఈమేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఠాకూర్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జగన్ పై హత్యాయత్నం కేసులో A4 సైజు పేపర్లు ప్యాంటు జేబులో పెట్టుకున్నా నలగలేదని రిపోర్టు ఇచ్చాడు కాబట్టి ఠాకూర్ ని స్టేషనరీ డీజీపీ గా ట్రాన్సఫర్ చేసారని, అసలు ఈ కాన్సెప్టే కొత్తగా ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు.