ధర్మపోరాట దీక్ష పేరుతో సీఎం చంద్రబాబు మరోసారి దీక్ష చేయబోతున్నారు. ఢిల్లీ వేదికగా ప్రత్యేకహోదా కోసం మోడీని నిలదీస్తారట.. మరో రెండునెలల్లో ఎన్నికలు రాబోతున్న నేపధ్యంలో ఈ నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన చంద్రబాబుకు హోదా ఇప్పుడు హోదా కావాలని ఢిల్లీ వేదికగా దీక్షకు దిగుతున్నారు. అయితే తన కొడుకు నారా లోకేశ్ కు మూడేళ్లు ముందుగానే మంత్రి పదవి ఇచ్చి, నోట్లరద్దును దృష్టిలో పెట్టుకుని హెరిటేజ్ విషయంలో జాగ్రత్త పడ్డాడు. అలాగే వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాడు. కానీ ఏపీకి హోదా విషయం మాత్రం చంద్రబాబుకు ఇంత లేటుగా గుర్తుకొచ్చింది. గత నాలుగేళ్లుగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న వైసీపీ నాయకులపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టని కేసులేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జగన్ నిర్వహించే యువభేరిలకు హాజరైతే కేసులు పెడతామని బెదిరించారు.
ఆయా కళాశాలల విద్యార్థులను యాజమాన్యాలు జగన్కు సపోర్టు చేస్తున్నారన్న కారణంతో ఇబ్బందులకు గురిచేశారు. సోనియా గాంధీని ఎన్నిమాటలన్నారో చెప్పాల్సిన పనిలేదు. రాహుల్ గాంధీ ఏపీకి వస్తుంటే ఏ మొహం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. పుండు మీద కారం చల్లుతారా అంటూ ఫైరైన చంద్రబాబు ఎన్నికల్లో లబ్ధికోసం బీజేపీతో జట్టుకట్టి కాంగ్రెస్ నాయకులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. బీజేపీతో కలిసున్నంత కాలం నరేంద్ర మోడీ గ్రేట్ ప్యాకేజీ బెస్ట్ అని, హోదా ఏమైనా సంజీవనా అంటూ ప్రచారం చేసి, అసెంబ్లీలో సైతం గంభీరంగా ప్రకటించాడు. అర్ధరాత్రి ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మరీ అరుణ్జైట్లీకి శాలువా కప్పి, తిరుపతి లడ్డూలు ఇచ్చి మరీ సన్మానం చేసారు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్న తరుణంలో సరిగ్గా ఏడాది ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకుని హోదాపై పోరాటం అంటూ కొత్త నాటకాలకు తెరలేపాడు.