మరి కొద్ది నెలల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లలో గెలిచి విజయం సాధించనుందని ‘రిపబ్లిక్ టీవీ – సీ ఓటర్’ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని అధికార తెలుగుదేశం కేవలం 6 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరుతో జరిగిన ఈసర్వే ఫలితాలను రిపబ్లిక్ టీవీ గురువారం విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకుగానూ వైసీపీకి 19ఎంపీ సీట్లు, టీడీపీకి కేవలం ఆరు సీట్లు వస్తాయట.. ముఖ్యంగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు ఏపీలో ఒక్క సీటు కూడా గెలవలేవని పేర్కొంది.
అలాగే ఓట్ల శాతంలోనూ వైసీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచిందట.. ఓట్ల శాతం పరంగా చూసినా సర్వేలో వైసీపీదే పైచేయిగా ఉంది. వైసీపీకి 41.3 శాతం, టీడీపీకి 33.1 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన ఏపీలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు, బీజేపీకి రెండు ఎంపీ సీట్లు వచ్చాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ 8 ఎంపీ సీట్లు సాధించింది. సీ ఓటర్ సంస్థ గతంలో వెల్లడించిన సర్వేలో కూడా వైసీపీ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే నేషనల్ మీడియా సర్వేలు తెలంగాణ ఎన్నికల సందర్భంగా నిజమైన నేపధ్యంలో వైసీపీ శ్రేణులు ఈ సర్వేపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు పాదయాత్ర పోరాట పటిమతోపాటు తెలుగుదేశం అక్రమాలే ఆపార్టీని ఇంటికి సాగనంపుతున్నాయని చెప్తున్నారు.