తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీకి రాజీనామా చేసిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి నక్కతోక తొక్కబోతున్నాడా..?. ఇప్పటికే గతేడాది జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి రేవంత్ రెడ్డి ఓటమి పాలైన సంగతి విదితమే.
అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటి చేసి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొంది మంచి ఊపులో ఉన్న ఆయనకు కాంగ్రెస్ జాతీయ అధిష్టానం శుభవార్తను తెలపనున్నదా..?. అంటే అవునే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ చీఫ్ ను మార్చాలని డిమాండ్ వస్తోన్న నేపథ్యంలో కొత్త టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ పదవీకి పోటిగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి చేరనున్నారు. ప్రస్తుతం చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. అందుకే కొత్త చీఫ్ గా అనుముల రేవంత్ రెడ్డిని నియమించడానికి రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా పార్టీముఖ్యులతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆ పార్టీలో టీఆర్ఎస్ ను సమర్ధవంతంగా ఎదుర్కుంటున్న రేవంత్ రెడ్డిని చీఫ్ గా నియమించడానికి జాతీయ అధిష్టానం ముగ్గుచూపుతుందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.