ఆపదలో ఉన్నామని చెప్పుకోగానే తక్షణమే స్పందించే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. జాతీయస్థాయి నీట్లో 50వ ర్యాంక్ సాధించిన కుష్వంత్ చదువుకు రూ.ఐదు లక్షలు అందజేసి అండగా నిలిచారు. ఆర్థికస్తోమత లేని బీటెక్ విద్యార్థి పవన్కు రూ.65 వేల తక్షణసాయం అందించి భరోసాగా నిలిచారు. ప్రమాదంలో ఒక కాలును కోల్పోయిన కాంబోజ సాగర్ త్రిచక్ర వాహనం ఇప్పించాలని కోరగా, టీఆర్ఎస్ సీనియర్ నేత గడ్డంపల్లి రవీందర్రెడ్డి గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్లో భాగంగా కేటీఆర్ సమక్షంలో వాహనాన్ని అందజేశారు. శుక్రవారం ఈ మూడు కార్యక్రమాలకు హైదరాబాద్ వేదికైంది.
సరస్వతీ పుత్రుడికి భరోసా
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కు చెందిన లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన భార్య అనిత బతుకుతెరువు కోసం భూపాలపల్లికి వచ్చి దుస్తులు కుడుతూ కుమారులను చదివిస్తున్నారు. కుమారుడు కుష్వంత్ ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ ఎంసెట్ రాష్ట్రస్థాయిలో తొలిర్యాంకు, ఏపీ ఎంసెట్లో ఎనిమిదో ర్యాంకు, జాతీయస్థాయి నీట్లో 50వ ర్యాంక్ సాధించాడు. ఢిల్లీ ఎయిమ్స్లో సీటు లభించింది. ఫీజు చెల్లించే స్తోమత లేకపోవడంతో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు రూ.రెండు లక్షల నగదు, ల్యాప్టాప్ అందించారు. విద్యార్థి పరిస్థితిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్ శుక్రవారం తెలంగాణభవన్కు పిలిపించి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.ఐదు లక్షల చెక్కును కుశ్వంత్కు అందజేశారు. ఉన్నత చదువులకు సహకరిస్తానని హామీఇచ్చారు. మంచి వైద్యుడిగా పేరుతెచ్చుకొని తెలంగాణ ప్రజలకు సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, టీఆర్ఎస్ నాయకులు పోలుసాని లక్ష్మీనర్సింహారావు, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదల చదువుకు కొండంత అండ
రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని సుందరయ్యనగర్కు చెందిన సాంబారం శ్రీనివాస్, లలిత దంపతులు ఫుట్పాత్పై టీస్టాల్ నిర్వహిస్తున్నారు. వీరి కుమారుడు పవన్ ఈ సెట్లో 98వ ర్యాంక్ సాధించగా హైదరాబాద్లోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ విభాగంలో అడ్మిషన్ లభించింది. విద్యాభ్యాసం కొనసాగించేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో సమస్యను కేటీఆర్కు వివరించారు. ఆయన సూచన మేరకు శుక్రవారం హైదరాబాద్కు రాగా, హాస్టల్ వసతి, ల్యాబ్, ఇతర ఖర్చుల కోసం రూ.65 వేల నగదును సొంతంగా పవన్కు అందించారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భవిష్యత్తులోనూ తన సహకారం ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. మా పవన్కు అన్న లెక్క చదువులో సాయం చేసిండు. దయాగుణం గల సార్ను మరిచిపోం. మా ఇంటి మనిషి లాగా ధైర్యం చెప్పిండు. సార్ను దేవుడు సల్లంగా సూడాలి అని పవన్ తల్లిదండ్రులు శ్రీనివాస్, లలిత పేర్కొన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల 25వ వార్డు కౌన్సిలర్ బత్తుల వనజారమేశ్ పాల్గొన్నారు. ఇటీవల జాతీయపోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి ఫీజుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ సొంతంగా అందించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పోటీపరీక్షలో దేశవ్యాప్తంగా తొలిర్యాంకు సాధించిన మేడ్చల్ జిల్లా గాజుల రామారానికి చెందిన నిరుపేద విద్యార్థిని కే లావణ్యకు ఆర్థిక సహాయాన్ని అందించారు.
దివ్యాంగునికి ఆసరా
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్కు చెందిన కాంబోజ సాగర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి ప్రమాదంలో కాలు కోల్పోయాడు. తర్వాత సొంతూరికి వచ్చి కిరాణం దుకాణం నడుపుతున్నాడు. వ్యాపార నిర్వహణకు అంగవైకల్యం ఇబ్బందిగా మారిందని, త్రిచక్ర వాహనం ఇప్పించాలని ట్విటర్లో కేటీఆర్కు విన్నవించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న టీఆర్ఎస్ సీనియర్ నేత గడ్డంపల్లి రవీందర్రెడ్డి త్రిచక్ర వాహనం అందించేందుకు ముందుకొచ్చారు. కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్లో భాగంగా శుక్రవారం తెలంగాణభవన్లో కేటీఆర్ చేతుల మీదుగా సాగర్కు వాహనాన్ని అందజేశారు. సాగర్ జీవనోపాధి కోసం అవసరమైన సహాయాన్ని అందిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, టీవీసీసీ చైర్మన్ వాసుదేవరెడ్డి, టీఎస్టీఎస్ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రియుడి నుంచి న్యాయం కోసం విజ్ఞప్తి
ఓ యువకుడు తనను ప్రేమించి మో సం చేశాడని, అతడి నుంచి తనకు న్యా యం జరిగేలా చూడాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఓ యువతి కోరారు. ఏపీలోని కృష్ణా జిల్లా కు చెందిన అశోక్ తనను ప్రేమించి మోసంచేశాడని వనపర్తి జిల్లా వెల్లటూర్కు చెందిన యువతి శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్కు ఫిర్యాదుచేశారు. 20 రోజుల్లో పెండ్లి చేసుకుంటానని కుషాయిగూడ పీఎస్లో ఒప్పుకొని ఏడాది గడుస్తున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యను తెలుసుకొని ఆమెకు న్యాయం చేయాలని టీఆర్ఎస్ మహిళా విభాగం ప్రతినిధులకు కేటీఆర్ సూచించారు. యువతి నుంచి టీఆర్ఎస్ మహిళా ప్రతినిధులు వివరాలు సేకరించి నుంచి న్యాయం చేస్తామని హామీఇచ్చారు.
By NT