దివంగత ముఖ్యమంత్రి, తమిళులు అమ్మగా భావించే జయలలిత జీవిత కథను తెరకెక్కించేందుకు పలువురు దర్శకులు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు దర్శకులు సినిమాల్ని తీస్తుండగా ఒకరు వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసినదే. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మొదటి నుంచి అమ్మ బయోపిక్ ని వ్యతిరేకిస్తోంది, అయితే ఈ మూడు సినిమాల్లోనూ అవాస్తవాలు చూపిస్తున్నారనే నేపద్యంలో ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
తాజాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు దీపా జయకుమార్ పిటీషన్ ని తిరస్కరించింది. జయలలితపై తెరకెక్కుతోన్న మూడు చిత్రాలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కొన్ని షరతులు విదించింది. తెరకెక్కనున్న ఈ 3 సినిమాలలో దీపని పోలిన ఏ పాత్ర ఉండరాదని తెలిపింది. తాజాగా కోర్టు తీర్పుతో మూడు సినిమాలకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే ది ఐరన్ లేడీ సెట్స్ లో ఉంది. తలైవి షూటింగ్ స్పీడందుకోనుంది. గౌతమ్ మీనన్ ఇప్పటికే క్వీన్ వెబ్ సిరీస్ టీజర్ కూడా విడుదల చేశారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ సినిమాలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇకపై ఎలాంటి విఘ్నాలు లేకుండా షూటింగ్ చేసుకోవచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు చిత్ర నిర్మాతలు దర్శకులు. అయితే హైకోర్టు పిటీషన్ ని కొట్టేసిన నేపథ్యంలో దీపా జయకుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని కోలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.