రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. ప్రస్తుతం తీసుకున్న, చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు.
నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలతో సమీక్షకు రావాలని సీఎం ఆదేశించారు. మున్సిపల్, వ్యవసాయ, పంచాయత్రాజ్, విద్యుత్శాఖల మంత్రులు కే తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్కు చెందిన మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, మున్సిపల్, వ్యవసాయ, ఆర్అండ్బీ శాఖల ముఖ్య కార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ సమీక్షకు హాజరుకానున్నారు.
ఆయా శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు, అంచనాలతో సమావేశానికి రావాలని సీఎం చెప్పారు. భారీ వర్షాలతో తలెత్తిన పరిస్థితి, ప్రస్తుతం తీసుకున్న పునరావాస చర్యలు, తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పేర్కొనాల్సిన అంశాలపై సీఎం సమీక్షించనున్నారు.