ఎన్నికలు రాగానే అందరూ పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నారని, ప్రశాంతమైన హైదరాబాద్లో చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. హైదరాబాద్ వరదకష్టంలో ఉంటే ఒక్కరూ రాలేదని, కానీ, ఓట్లకోసం ఢిల్లీ నుంచి డజన్మంది దిగుతున్నారని విమర్శించారు. ‘ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు ముఖ్యం, మతం కాదు.. జనహితం ముఖ్యం.
మన నినాదం విశ్వనగరం.. వాళ్లది విద్వేష నగరం, రెచ్చగొడితే రెచ్చిపోకండి.. పిచ్చోళ్ల మధ్య ఆగం కాకండి’ అని సూచించారు. అభివృద్ధి వైపు అడుగులేద్దాం.. డిసెంబర్ ఒకటి ఆలోచించి ఓటేద్దాం అని పిలుపునిచ్చారు. కేంద్రం నుంచి ఒక్కరూపాయి రాకున్నా రాష్ట్రప్రభుత్వం ఆరున్నర లక్షల కుటుంబాలకు రూ.10వేల చొప్పున వరద సాయం అందజేసిందని చెప్పారు.
బీజేపీ మత రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతుంటే.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నదని ఆరోపించారు. ఆరేండ్ల నుంచి హైదరాబాద్లో హిందూ-ముస్లిం గొడవల్లేవని చెప్పా రు. బుధవారం ఉప్పల్ నియోజకవర్గంలోని ఈసీఐఎల్ చౌరస్తా, శివహోటల్ జంక్షన్, చిలుకానగర్ జం క్షన్, రామాంతపూర్ హెచ్పీఎస్ వద్ద రోడ్షోల్లో కేటీఆర్ మాట్లాడారు.