సీఎం కేసీఆర్ బహిరంగ సభకు నగరంలోని ఎల్బీ స్టేడియం ముస్తాబవుతున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28 సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా సభా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీ కుమార్, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి, పార్టీ నేత కర్నె ప్రభాకర్ను అడిగి తెలుసుకున్నారు.
సభ సందర్భంగా స్టేడియం లోపల, చుట్టుపక్కల భద్రతా ఏర్పట్లకు సంబంధించిన అంశాలను సీఎం అంజనీ కుమార్ వివరించారు. అదేవిధంగా సభా వేదికను మంత్రి కేటీఆర్ పరిశీలించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తున్నది. ప్రచారంలో మంత్రి కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ అభ్యర్థుల విజయాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్న మంత్రి నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ప్రతిరోజు ఆరు రోడ్ షోలలో పాల్గొంటున్నారు. ప్రతి డివిజన్లో రోడ్ షో ఉండేలా ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా పార్టీ అభ్యర్థుల పక్షాన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే నెల 1న జరుగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 4న వెలువడనున్నాయి.