మురికి మూసీని సుందర మూసీగా మార్చే పనులు వాయువేగంతో సాగుతున్నాయి. కాలుష్య కోరల నుంచి మూసీని రక్షించి ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రభుత్వం సుందరీకరణ పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా మూసీకి సమాంతరంగా నాగోలు వంతెన మొదలుకొని కొత్తపేట సత్యానగర్ వరకు రోడ్డు ఫార్మేషన్ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి.
మూసీని సుందరీకరించాలన్న సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మూసీ తీరప్రాంత అభివృద్ధి సంస్థ(ఎంఆర్డీసీ) చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని పనులు చేయిస్తున్నారు. నది పక్కనే రోడ్డును నిర్మించనుండగా, ప్రస్తుతం నాగోలు వంతెన నుంచి సత్యానగర్ వరకు మట్టి పనులు జరుగుతున్నాయి.
మధ్యలో మోహన్నగర్ వద్ద మురుగుకాల్వపై పైప్లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటివరకు మోహన్నగర్ శ్మశానవాటిక వరకు రోడ్డు ఫార్మేషన్ పనులు పూర్తికాగా, సత్యానగర్ వైపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మూసీనదికి రోడ్డుకు మధ్య మొక్కలు పెంచడంతోపాటు నదిని సుందరీకరించి ఆహ్లాదంగా మార్చనున్నారు.